అనంతపురం: కొన్నాళ్లుగా సోదరుల మధ్య ఉన్న ఆస్తి పంపకాల వివాదం.. అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసేందుకు ఉరికొల్పింది. అన్న కనిపించకపోవడంతో ఆయన బైక్ను ముక్కలు చేసిన తమ్ముడు.. అనంతరం మరో ప్రాంతంలో ఉన్న అన్నను గుర్తించి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని స్థానికులు, బంధువులు గమనించడంతో అన్న ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా గుంతకల్లులోని భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన దేవేంద్ర, ఆంజనేయులు సోదరులు. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి వివాదం కొనసాగుతున్నది. తనకు ఆస్తిని పంచి ఇవ్వకుండా వేధిస్తున్నాడని అన్న దేవేంద్రపై తమ్ముడు ఆంజనేయులు కోపం పెంచుకున్నాడు. అన్నను చంపితే మొత్తం ఆస్తి తనకు వస్తుందని భావించిన ఆంజనేయులు.. అన్నను చంపేందుకు వేటకొడవలితో బయల్దేరాడు. బస్టాండ్లో అన్న బైక్ కనిపించగానే.. దాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం అన్న వైఎస్సార్ చౌరస్తాలో ఉన్నడన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి దేవేంద్రపై దాడికి ప్రయత్నించాడు.
గమనించిన బంధువులు, స్థానికులు సోదరులను విడదీశారు. ఆంజనేయులు వద్ద ఉన్న కొడవలిని లాక్కొని గట్టిగా పట్టుకున్నారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆంజనేయులు వద్ద ఉన్న కొడవలిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు గుంతకల్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.