అమరావతి : అరాచాకాలు, బెదిరింపులతో ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక రంగాలు నిర్వీర్యమవు తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గత నెలరోజులుగా సినిమా పరిశ్రమను లొంగ దీసుకునేందుకు థియేటర్లపై నిబంధనల పేరిట దాడులు సృష్టించిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం సరైనది కాదని పేర్కొన్నారు. కేంద్రం అందజేస్తున్న నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
గడిచిన రెండు సంవత్సరాల వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. బీజేపీ తరుఫున మండల స్థాయి భేటీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.