AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మరో ప్యాకేజి స్టార్లా మారిపోయాడని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించింది. ఎన్నికల ఫలితాలపై పీకే వేసే అంచనాలు ఎప్పుడూ తప్పేనంటూ పేర్కొంది. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ మాట్లాడిన ఒక వీడియోను ట్వీట్ చేసింది.
సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ తన సహనాన్ని కోల్పోయినట్లు ఆ వీడియోలో ఉంది. హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ చెప్పిన జోస్యం తప్పింది కదా అని పీకేని కరణ్ థాపర్ ప్రశ్నించారు. దానికి తాను జోస్యాలు చెప్పే వ్యాపారం చేయడం లేదంటూ సమాధానమిచ్చాడు. అంతేకాకుండా హిమాచల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తాను అన్నట్లుగా వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.
అప్పుడు హిందూస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికలు, వెబ్సైట్లు ఈ వార్తలను ప్రచురించాయని కరణ్ థాపర్ గుర్తుచేశారు. దానికి పీకే మరింత ఆగ్రహానికి గురయ్యారు. పత్రికలు, వెబ్సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని విమర్శించారు. కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించేందుకు ప్రయత్నించినా ప్రశాంత్ కిశోర్ వినిపించుకోలేదు. ఆధారాలు చూపించనందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసుకున్న దానికి బాధ్యున్ని కాదంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత నమ్మకంగా ఎలా చెప్పగలరని మాత్రమే అడిగానని కరణ్ థాపర్ చెప్పగా.. మరో ప్రశ్నకు వెళ్లాలని సూచించారు.