గుంటూరు: అత్యంత ప్రతిష్టత్మకంగా భావిస్తున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని మైదానంలో రేపటి నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని నియమించే తీర్మానంతో పాటు పలు రాజకీయ తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మార్గదర్శనం చేసే పలు అంశాలపై లోతుగా చర్చించనున్నట్లు సమాచారం.
వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజున వైసీపీ ప్లీనరీ సమావేశం శుక్రవారం ఉదయం 8 గంటలకు కార్యకర్తల రిజిస్ట్రేషన్తో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లకు ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీలో పలు తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణపై కసరత్తులు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ప్లీనరీ వేదిక నుంచి పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో లోతుగా చర్చించి.. పార్టీ అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు నడుం బిగించినట్లు తెలుస్తున్నది.
ఇప్పటివరకు ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఆనవాయితీ ఉండగా.. ఇప్పుడు పార్టీ రాజ్యాంగానికి సవరణలు తీసుకొచ్చి పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండేలా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 12 సంవత్సరాలుగా జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్లీనరీ జరగనుంది. 2017లో వైసీపీ ప్లీనరీ జరిగింది. మరోవైపు రేపు దాదాపు 1.50 లక్షల మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యే అవకాశముందని తెలుస్తున్నది. వీరి కోసం ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సీఎం జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం సర్వమత ప్రార్థనలు ఉంటాయి. 10.55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్ష హోదాలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ జమాఖర్చుల నివేదికను సభ ముందుంచుతారు. ఆ తర్వాత పార్టీ నియమావళికి సవరణలు చేసే ప్రతిపాదనలను ఆమోదిస్తారు. ఉదయం 11.45 గంటలకు మహిళా సాధికారత చట్టంపై చర్చ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు పావు గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్పై తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.