అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరుగుండా వెళ్తుంది. రాత్రి నెల్లూరు సమీపంలోని అంబాపురం శాలివాహన ఫంక్షన్హాల్లో బస చేసిన రైతుల వద్దకు అధికార పార్టీకి చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వెళ్లి పలకరించడంతో రైతులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
తన నియోజకవర్గం గుండా వెళ్తున్న రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ అవసరమొచ్చిన నిర్మోహమటంగా తనను అడగాలని సూచించారు. కొందరు రైతులు జై అమరావతి అనాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించి, ఆ మాట అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సర్ది చెప్పారు.