అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై అధికార వైసీపీ నాయకులు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని నటుడు చిరంజీవి, అతడి సోదరుడు పవన్కల్యాణ్ మధ్య చిచ్చురేపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనశక్తి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అవలంభించిన విధానాలను పవన్ కల్యాణ్ ఇవాళ జరిగిన సమావేశంలో వివరించారు. వీటిలో చంద్రబాబుకు అందించిన సహకారాన్ని ప్రస్తావించారు. అధికార వైసీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.
వీటినన్నింటిపై మీడియా ముందు పేర్నినాని స్పందించారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడడం దుర్మార్గమైన విషయమని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకు పవన్ వెన్నుపోటు పొడిచాడని పేర్నినాని ఆరోపించారు. చిరంజీవి దయతో ఉన్నతస్థాయికి వచ్చిన పవన్ పరోక్షంగా చిరంజీవిని తప్పుబడుతూ మాట్లాడుతున్నారని వివరించారు. వారాంతపు ప్రజా నాయకుడు పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న అక్కసుతో ప్రతిరోజూ విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏ ఒక్కనాడైనా చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడం లేదని ఆరోపించారు. 2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్.2014లో అదే వ్యక్తికి ఓటేయమని ప్రజల్ని కోరాడని గుర్తు చేశారు.