అమరావతి : ఏపీలోని అధికార వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని సత్యవేడు (Satyavedu) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (MLA Adimulam) ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి(Minister Peddireddy) ఇంట్లో నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా సమావేశం పెట్టడమేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి , కరుణాకర్రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ ప్రశ్నించారు.
సత్యవేడు స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు(Sand Mafia) చేపట్టారని ఆరోపించారు. మంత్రి అక్రమాలన్నింటినీ నాపై తోసి సత్యవేడు నుంచి తప్పించారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి చేసిన కుట్రలో భాగంగానే తనను ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి ఎంపీ స్థానానికి పంపిస్తున్నారని విమర్శించారు.
1989లో మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత ? అని ప్రశ్నించారు. ఇష్టం లేకపోయినా తనను తిరుపతి(Tirupati) ఎంపీ స్థానం ఇన్చార్జ్గా ప్రకటించారని ఆరోపించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల సహకారం తనపై ఉందని అన్నారు. దళితుడయిన తనను అవమానపరుస్తున్నారని ఆరోపించారు.