అమరావతి : సామాజిక న్యాయమంటూ కొత్త డ్రామాతో వైసీపీ మంత్రులు బస్సు యాత్రలు ప్రారంభించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎవరి చెవులో పువ్వులు పెట్టేందుకు బయలుదేరారని విమర్శించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాము బీసీలకు చిత్తశుద్ధితో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఒంగోలులో జరగనున్న మహానాడుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు.
మార్గమధ్యలో యడ్లపాడు, చిలకలూరిపేట గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పన్నులు, ధరల పెంపుదల వల్ల జరుగుతున్న ఇబ్బందులపై ప్రజాపోరు చేసేందుకు బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని తీసుకుంటే వైసీపీ గడప గడపకు అనే కార్యక్రమం తీసుకుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. నేడు బస్సు యాత్ర రేపు గాలి యాత్రలు చేపడుతారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడితే కొండవీటి సింహంలా ఎదురుపోరాడుతారని అన్నారు. పిచ్చిపిచ్చి వేశాలు వేస్తే జగన్రెడ్డి తోక కట్ చేస్తామని హెచ్చరించారు. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కిరాతంగా చంపివేశాడని తెలిపారు. ఈ ఘటనపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి కోనసీమలో అంబేద్కర్ జిల్లా పేరిట వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడి ఆ నేపాన్ని టీడీపీ, జనసేన నాయకులపై వేస్తున్నారని మండిపడ్డారు.