అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈనెల 26న విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నిధులు ఇచ్చిందని అన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం సొంత పేర్లు పెట్టి ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.