అమరావతి : ఏపీలో ఎన్నికల రోజున జరిగిన విధ్వంసక ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 13న పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాలు జరిగితే, 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చిందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) , వైసీపీ నాయకుడు అనిల్కుమార్ యాదవ్ (Anil Kumar yadav) ప్రశ్నించారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్నికల్లో 9 చోట్ల ఈవీఎం(EVM) లు పగలగొడితే, ఒక్క మాచర్ల ఎంఎల్ఏ రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం విజువల్స్ (Visuals) బయటికి ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఒక్క వీడియో బహిర్గతంపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా వీడియోల సంగతిని ఎందుకు రిలీజ్ చేయలేదని, అందులో ఎవరెవరూ భాగస్వామ్యమయ్యారో తేల్చాలని డిమాండ్ చేశారు.
పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలకు మూడు రోజులు ముందుగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మార్చేసి , ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ నాయకులు చేసిన దాడులపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు.