AP News | కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తమ గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉంది కానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ గెలవడానికి ఒక్క కారణమైనా చెప్పాలని నిలదీశారు. పోలింగ్ శాతం పెరిగితే గెలుస్తామన్న భ్రమలో టీడీపీ ఉందని విమర్శించారు.
ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని అనుకోలేమని సజ్జల తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పూర్తిగా నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు. కూటమి ఏర్పాటు తర్వాత చంద్రబాబుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. ఈసీ వైఫల్యం వల్లనే ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. చంద్రబాబు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు భావిస్తున్నారని తెలిపారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఎన్నికలయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా జరిగితే వైసీపీకే లాభం జరగుతుందని స్పష్టం చేశారు. ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ రకమైన హింసాత్మక ఘటనలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. కుప్పంలో కూడా గెలిస్తామని తమకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.