Pothina Mahesh | విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ అన్నారు. అమ్మవారి ఆలయంలో పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారని ఆరోపించారు. పార్కింగ్, టోల్ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని విమర్శించారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అని అన్నారు.
దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి మరీ టీడీపీ నాయకులు జీవోలు జారీ చేయించుకుంటున్నారని పోతిన మహేశ్ మండిపడ్డారు. కాంట్రాక్టు పూర్తయితే మళ్లీ 10 శాతం పెంచి సదరు కాంట్రాక్టర్కే కాంట్రాక్ట్ ఇవ్వాలని.. అలాంటిది రెండు కోట్లకు పైగా సొమ్మును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పైగా నాలుగు నెలల పాటు భక్తుల నుంచి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఎలా ఇచ్చారని నిలదీశారు.
కనకదుర్గ నగర్లో షాపుల ఏర్పాటులోనూ అక్రమాలకు తెరతీశారని పోతిన మహేశ్ విమర్శించారు. బకాయిలు ఉన్నా, వ్యాపారాలు సజావుగా సాగుతున్నా కూడా 49 శాతం అద్దెలను తగ్గించారని తెలిపారు. ఇందుకోసం బుద్ధా వెంకన్న ఒక్కో దుకాణానికి రూ.5లక్షల చొప్పున లంచం తీసుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.4కోట్లు వసూలు చేశారని అన్నారు.
విజయవాడ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీతో విచారణ జరిపించాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. దీనిపై ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా సిద్ధమే అని చెప్పారు. నిందితులకు శిక్ష పడేంతవరకు న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అమ్మవారి ఆలయంలో జరిగే అక్రమాలపై పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.