Perni Nani | అధికారులు బరించి తెగించి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే.. ఆ అధికారులను నియమించారని ఆరోపించారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదని అన్నారు. వైసీపీ నేతలపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పాల్వాయిగేటు వద్ద దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని తెలిపారు. పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారని ఈ నెల 15న ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. దీనిపై 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని టీడీపీని ప్రశ్నించారు. డీజీపికి సిట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదని.. ఈసీనే దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ నెల 21న ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని సీఈసీ ఆదేశించిందని అన్నారు.
పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదని? నిలదీశారు. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా? పిన్నెల్లి వీడియోను టీడీపీ ట్వీట్ చేస్తే విచారణకు ఆదేశిస్తారా? అని ఈసీని ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా? అని నిలదీశారు. నిజంగానే ఎమ్మెల్యేనే ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈసీ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని.. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. నారా లోకేశ్ ఒక వీడియోను రిలీజ్ చేయగానే.. స్పందించిన ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్టు చేయమని ఈ నెల 21 సీఈసీ ఆదేశించిందని తెలిపారు. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసిందన్నారు.
టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఈసీని పేర్ని నాని ప్రశ్నించారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని.. టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ముద్దాయిలను వదిలేసి.. తప్పు చేయనివారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోందని.. వారికి పోలీసుల సహకారం ఉందని ఆరోపించారు. హత్య చేయాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. పిన్నెల్లికి హాని జరిగిని ఐజీ, ఎస్పీ, డీజీపేదే బాధ్యత అని హెచ్చరించారు.