Lakshmi Parvathi | భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య నాయుడు ఎలా అంటారని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అనే పుస్తకం రాస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలని సూచించారు. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవడం, వైశ్రాయి హోటల్ పరిణామాలు కూడా రాయలన్నారు. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారని అన్నారు.
జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయడం దారుణమని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని అన్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వాణీ, వాజ్పేయి ఆరా తీవారని తెలిపారు. కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్య నాయుడు మాత్రం ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడికి లేదని అన్నారు.
తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య నాయుడు ఎలా అంటారని ప్రశ్నించారు. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడా? అబద్ధాలు చెబుతూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దని అన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలని సూచించారు. గతంలో వాజ్పేయి, గుజ్రాల్, దేవెగౌడ వంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ భారతరత్న పేరు ఎత్తుకున్నారని మండిపడ్డారు.