కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి వైసీపీ నాయకులు రంగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నది. గుడివాడలో చంద్రబాబు నాయుడు హాజరయ్యే టీడీపీ మినీ మహానాడుకు ముందు ఈ పరిణామం చోటు చేసుకున్నది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహం చుట్టూ వేసిన రంగులను తొలగించారు. పాలతో విగ్రహాన్ని శుభ్రం చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభోత్సవానికి టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ఇంతలో విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు కనిపించడంతో టీడీపీ శ్రేణులు షాక్కు గురయ్యారు. చంద్రబాబు పాల్గొనే మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో ఉన్న బొమ్ములూరులో ఈ ఘటన చోటు చేసుకున్నది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితర టీడీపీ నేతలు బొమ్ములూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లను చించివేసిన అధికార పార్టీ నేతలు, ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.