అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇవాళ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో నిర్మిస్తున్న కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణపట్నం స్టేజ్ 2 ప్లాంట్ ను, ఎన్టీపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు.
ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే ప్రస్తుత సామర్ధ్యానికి అదనంగా 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని వివరించారు.