Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని దేవాలయ ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు చేసి వార పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారిని ఆమెకు ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ చేశారు. అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్ర నామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని రాగసుధ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు శంభో శివశంబో అంటూ సంప్రదాయ కూచిపూడి నృత్యాలతో స్వామి అమ్మవార్లకు నృత్య నివేదన చేశారు. సాయంత్రం ఆలయ దక్షిణ మాడ వీధిలో కళారాధన వేదికపై చిన్నారులు చేసిన నృత్యాలను భక్తులు భారీ సంఖ్యలో వీక్షించారు. శివభక్తి గీతాలతో పరవశించిపోయారు.