విశాఖలో విషాదం చోటుచేసుకున్నది. ఆర్కేబీచ్లో ఓ వివాహిత గల్లంతైంది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ గల్లంతు కావడం వారి కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. గల్లంతైన మహిళ ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన సాయిప్రియగా గుర్తించారు. అయితే, సాయిప్రియ గల్లంతుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్ ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్ సాయిప్రియ తన భర్త ఆర్పీ రెడ్డితో కలిసి సోమవారం రాత్రి ఆర్కే బీచ్కు వచ్చింది. బీచ్లో కాసేపు గడిపి రాత్రి 7.30 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కాళ్లు కడుక్కునేందుకు బీచ్లోకి దిగిన సాయిప్రియ రెప్పపాటు కాలంలో గల్లంతైంది. ఆ సమయంలో తాను ఆమెను సరిగ్గా పట్టించుకోలేదని, కొంత సేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి కనిపించలేదని భర్త ఆర్పీ రెడ్డి పోలీసులకు తెలిపాడు. ఆమె బీచ్లో మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెండ్లి రోజు కావడంతో సాయిప్రియ తన భర్త ఆర్పీ రెడ్డితో కలిసి ఆర్కే బీచ్కి వెళ్లినట్లు తెలిసింది. అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రీటౌన్ సీఐ రామారావు మీడియాకు తెలిపారు.
కొనసాగుతున్న గాలింపు..
ఆర్కే బీచ్లో సోమవారం రాత్రి కనిపించకుండా పోయిన సాయిప్రియ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నది. రెండు కోస్ట్గార్డ్ నౌకలు, ఒక హెలీకాప్టర్ ద్వారా గాలింపు చేపడుతున్నారు. ఆర్కే బీచ్ వద్ద ఆమె కుటుంబసభ్యులు వచ్చి బోరున విలపిస్తున్నారు. భర్త ఫోన్లో నిమగ్నమై ఉండగా.. సాయిప్రియ కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సాయిప్రియ కనిపించకుండా పోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకవేళ సముద్రంలోకి వెళ్లిపోయినట్లయితే 36 గంటల తర్వాత మృతదేహం కొట్టుకువచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. కాగా, గత కొన్నిరోజులుగా సాయిప్రియ తల్లి ఇంటివద్దనే ఉంటున్నట్లు తెలుస్తున్నది. సాయిప్రియ భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలనే విశాఖ వచ్చాడని, పెండ్లి రోజు కావడంతో ఉదయం సింహాచలం వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారని కుటుంబీకులు తెలిపారు. వీరికి పెండ్లయి రెండు సంవత్సారాలైనట్లుగా సమాచారం.