పల్నాడు జిల్లా : మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. తన కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తల్లి మూర్చపోయింది. తీవ్రంగా గాయపడి అపస్మారకంలోకి వెల్లిన తల్లిని చికిత్స నిమిత్తం గుంటూరు దవఖానకు పోలీసులు తరలించారు. పెండ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో చిలకలూరిపేటలోని వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటలో మంగళవారం సాయంత్రం జరిగింది.
చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీ డిగ్రీ పూర్తి చేసి.. స్థానిక బీఎస్ఎన్ఎల్ ఆధార్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో సాయిలక్ష్మి వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి వీరి పెండ్లి జరగనున్నది. తల్లితో కలిసి మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి స్కూటీపై సాయిలక్ష్మి బయల్దేరింది. అయితే, యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్దకే చేరేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలక్ష్మి బస్సు-స్కూటీకి మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్కూటీ వెనక కూర్చున్న తల్లి నాగలక్ష్మి తీవ్రంగా గాయపడింది. తన కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన నాగలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ప్రమాదం సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు చేరుకుని బస్సు-స్కూటీ మధ్య ఇరుక్కుపోయిన సాయిలక్ష్మిని క్రేన్ సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడదిన తల్లి నాగలక్ష్మిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. రోడ్డుపై పారేసిన దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లుగా అనుమానిస్తున్నారు. సాయిలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.