గుంటూరు : ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. తీసుకున్న రుణానికి వంద రెట్లకు పైగా కట్టించుకుంటూ ఇంకా చెల్లించాలని రుణ యాప్ నిర్వాహకులు వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయి. ఇటీవల కడప జిల్లా రాజంపేటలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే.. గుంటూరు జిల్లాలో ఈ తరహా మరో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్ , రూపెక్స్ యాప్స్ లో రూ.20 వేలు అప్పు తీసుకున్నది. రుణంగా తీసుకున్న రూ.20 వేల మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించినా ఇంకా బాకీ ఉన్నారంటూ వేధిస్తున్నారు. ఇంకా చెల్లించాల్సిన రుణం తాలూకు డబ్బులు రూ. 2 లక్షల వరకు ఉన్నాయని లోన్ యాప్స్ నిర్వాహకులు చెప్పడంతో ప్రత్యూష హతాశురాలైంది.
తాము అడిగినంత డబ్బు చెల్లించాలని, లేకుంటే ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని రుణ యాప్స్ నిర్వాహకులు ప్రత్యూషను బెదిరించారు. రుణం చెల్లించకపోతే బంధువులకు ఫోన్ చేసి వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపి వేధింపులకు గురిచేస్తున్నది నీకు తెలియదా అంటూ వారు బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష.. ఇంటిపైనున్న ఫ్లెక్సీకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు రుణ యాప్స్ వేధింపులతో తాను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసి పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.