తిరుమల : మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు(Dharmika Sadassu) నిర్వహిస్తున్నట్టు టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి(Karunakar Reddy) తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశం పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి(Vishnumurthy) వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు.
స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన అన్నమాచార్యులు, పురందరదాసు(Purandaradasu) , కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే సదస్సు సోమవారం ముగియనుంది.