Dates Farming | అనంతపురం : ఒకప్పుడు వానలు లేక కరవుతో అల్లాడిన అనంతపురం జిల్లా ఇప్పుడు సిరులనిచ్చే పంటలకు నెలవుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఖర్జూరం సాగు జోరుగా సాగుతున్నది. ఒకప్పుడు 5-10 ఎకరాలకే పరిమితమైన ఖర్జూరం సాగు ఇప్పుడు 500 ఎకరాలకు చేరుకోవడం పట్ల ఆ పంట సాగుకు రైతులు ఎంతగా మొగ్గు చూపుతున్నారో అర్ధమవుతున్నది.
అనంతపురం జిల్లా పరిధిలోని కణేకల్లో కేవలం 5 ఎకరాల్లో ఖర్జూరం సాగు మొదలైంది. ఇప్పుడు నార్పల, సింగనమల, రాయదుర్గం, రొద్దం, పెనుకొండ, కళ్యాణదుర్గం తదితర మండలాల్లో దాదాపు 500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులు అత్యంత లాభదాయకమైన, నీటి పొదుపు పంటగా గుర్తించడంతో ఈ పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అనంతపురం జిల్లాలో ఖర్జూర వ్యవసాయం అసాధ్యమన్నవారు కూడా ఇప్పుడు ఈ పంట సాగవుతున్న తీరు చూసి ముక్కున వేలేసుకుంటుననారు. ఎడారి మొక్క అయిన ఖర్జూరం సాగుకు చాల తక్కువ మొత్తంలో సాగునీరు అవసరముంటుంది.
కణేకల్లోని కృష్ణంరాజు అనే రైతు కేవలం 5 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేపట్టి హెక్టారుకు దాదాపు రూ.2.5 లక్షల లాభం పొందుతున్నాడు. నాణ్యత, రకాన్ని బట్టి కిలోకు రూ.500-800 మధ్య లాభం ఆర్థిస్తున్నాడు. నార్పల మండలానికి చెందిన రైతు చౌడప్ప మల్బరీ, పూలతోటలు పెంచుతూ 5 ఎకరాల పొలంలో ఖర్జూరం సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కో మొక్కను రూ.200 చొప్పున కొనుగోలు చేసి.. ఎకరం భూమిలో 350 మొక్కలు నాటాడు. ఇప్పుడు ఒక్కో మొక్క 150 కిలోల ఖర్జూర దిగుబడిని ఇస్తున్నది. ఇద్దరు రైతులు విజయవంతంగా ఖర్జూరం సాగు చేస్తుండటంతో వందల మంది రైతులు వీరి పొలాన్ని సందర్శించి తాము కూడా ఖర్జూరం సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. దాంతో ప్రస్తుతం దాదాపు 500 ఎకరాల్లో ఖర్జూరం సాగవుతున్నది.
46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, సగటు వర్షపాతం 3 అంగుళాల కంటే తక్కువగా ఉండే ప్రాంతాల్లో సాధారణంగా ఖర్జూరాలు పండిస్తారు. మొక్కకు తక్కువ తేమ, ఎక్కువ సూర్యరశ్మి అవసరం. పండ్ల సాగుపై ఆసక్తి చూపుతున్న పలువురు రైతులు.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఇతర పండ్ల తోటలకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం మద్దతుగా నిలిస్తే 5000 ఎకరాలకు ఖర్జూరం పంట సాగును విస్తరించవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు.