అమరావతి: తృటిలో సమ్మె తప్పిపోయిందని సంబరపడిపోయిన ఏపీ ప్రభుత్వ పెద్దలకు.. ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకున్నది. పీఆర్సీ సాధన కమిటీ నేతలను మచ్చిక చేసుకుని సమ్మెకు పోకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మెరుపు సమ్మెకు దిగాలని చూస్తున్న వారి పట్ల ఏవిధంగా వ్యవహరిస్తుందో అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలో ర్యాలీ నిర్వహించిన పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు చూపిన దారిలోనే వెళ్లేందుకు మరో వర్గం ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్నదని అనుకుంటున్న తరుణంలో.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో మరోసారి సమ్మె గంటలు మోగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రతిపాదనలు వచ్చినప్పటి నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఫిట్మెంట్ మినహా మిగతా అంశాల్లో ప్రభుత్వం దిగిరావడంతో పీఆర్సీ సాధన కమిటీ సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చల సమయంలో తమ గురించి పీఆర్సీ సాధన కమిటీ పెద్దలు ఆలోచించలేదని గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టేలా నిరసనకు పూనుకోవాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణయిస్తున్నట్లు సమాచారం.
ఉద్యమ కార్యాచరణను ఈ వర్గం వారు రూపొందించుకున్నారు. వీరి కార్యాచరణ ప్రకారం ఇవాల్టి నుంచి 28 వరకూ జిల్లా స్థాయి సదస్సులు, ఫిబ్రవరి 20 లోగా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, మార్చి6 న విజయవాడలో నిరసన దీక్ష చేపట్టేలా ప్లాన్ చేశారు. మార్చిలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల సందర్భంలో సమ్మెకు వెళ్లడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని వీరు భావిస్తున్నారు. ప్రభుత్వం పనుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు ఒక్కసారిగా మెరుపు సమ్మెకు పూనుకోవడం వల్ల రాష్ట్రంలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.