AP News | వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం జరిగింది. భార్య లావుగా మారడంతో పాటు.. తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న భర్త.. పాలకోవాలో విషం పెట్టి హత్య చేశాడు. ఈ కేసు వివరాలను ఏఎస్పీ విబూకృష్ణ మంగళవారం వెల్లడించారు.
ప్రొద్దుటూరు జిల్లా భద్రిపల్లి కిరణ్కుమార్కు ఎనిమిదేళ్ల కిందట ముద్దనూరులోని కొత్తకొట్టాలకు చెందిన పద్మజ(31)తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కిరణ్ ఇల్లరికం వెళ్లాడు. వీరికి ఒక పాప ఉంది. కరోనా తర్వాత నుంచి కిరణ్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఇటీవల అతని భార్య లావుగా మారింది. అయినా డైట్ చేయకుండా మాంసాహారం, జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకురమ్మని ఒత్తిడి చేయడంతో విసిగెత్తిపోయాడు. పైగా తనను అనుమానిస్తుండటంతో కక్ష పెంచుకున్నాడు. పద్మజను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను చూసొద్దామని చెప్పి గత నెలలో ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాడు. ఏప్రిల్ 29వ తేదీన పాలకోవాలవో విషం కలిపి ఆమెకు తినిపించి హత్య చేశాడు.
విషంతో భార్యను చంపడం ఎలా అని యూట్యూట్, గూగుల్లో కిరణ్ కుమార్ వెతికాడని పోలీసులు తెలిపారు. ఓ వీడియోలో నంబర్ ఉండటంతో ఫోన్ చేసి మాట్లాడి.. భార్యను చంపేందుకు రూ.80వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. గత నెల 29న కొరియర్లో విషం తెప్పించుకుని.. అదే రోజు పాలకోవాలో కలిపి భార్యకు ఇచ్చాడు. కాసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం ఆమె ముఖంపై దిండుతో గట్టిగా అదిమి చంచపేశాడు. అనంతరం గుండెపోటుతో మరణించిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అనుమానం వచ్చిన కిరణ్కుమార్ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.