అమరావతి : టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పేదల పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని వైఎస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వంతుల వారీగా మద్యం నిషేధిస్తామని మాట మార్చారని ఆరోపించారు.
గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి 11వేల 569 కోట్లు ఆదాయం రాగా ప్రస్తుతం విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 24,714 కోట్ల ఆదాయం వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన సొంత జేబులకు రూ. 10వేల కోట్లు రావడానికి మధ్యం పాలసీని మార్చుకున్నారని జగన్ను విమర్శించారు. శాసనసభలో నిన్న ఏపీ సీఎం జగన్ అవాస్తవాలు మాట్లాడారని తెలిపారు.
ప్రజల పక్షాన పోరాడేందుకు యత్నిస్తుంటే తమ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసారని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ఇంకేమైనా ఉందా అని అన్నారు. ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలనేదే తమ ఉద్దేశమని, ప్రజల ప్రాణాల రక్షణ కోసం టీడీపీ సభ్యులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.