అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను తొలగించడం వెనుక చంద్రబాబు(Chandra Babu), అండ్ కో కుట్ర చేసిందని పేర్కొన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసిని నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh) చంద్రబాబు మనిషేనని ఆరోపించారు.
ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వాలంటీర్ల (Volunteers) వ్యవస్థపై రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లంటే చంద్రబాబు (Chandra Babu) కు భయమని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతుంటే వాటిని ఆపాలనే ప్రయత్నం చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
‘ బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే’ నని వెల్లడించారు. కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయిందని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు శూన్యం.. పేర్ని నాని
ఎన్నికల కోడ్ అమలు అవుతుంటే టీడీపీ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నాయకుడు పేర్నినాని (Perni Nani) ఆరోపించారు. వాలంటీర్లను కొనసాగిస్తామంటూనే మరోవైపు నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు వాలంటీర్లంటే గిట్టదని అన్నారు.