అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పలు సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో పార్టీ తరుఫున లేవనెత్తే అంశాలను వివరించారు. శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.
పోలవరం నిర్మాణ ఖర్చు రూ. 55 వేల కోట్లు ఆమోదం, జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్ కలిపి చూడాలని , జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి లేవనెత్తిన 6 అంశాలను ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. బీసీ జనగణన గురించి, ఆహార భద్రత చట్టం, వరద బాధితులకు కేంద్రం సహాయం తదితర సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు.