అమరావతి : అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్ర వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యత వహించాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో మరోసారి మార్పులతో రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 29 గ్రామాల ప్రజలను ఉపయోగించుకుని అమరావతి రాజధాని పేరిట ఉద్యమాలకు ఉసిగొల్పడం దారుణమని ఆరోపించారు. ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసాపల్లి వరకు నిర్వహించే రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రజలు సహించ బోరని తెలిపారు. అమరావతి కోసం విజయవాడ, గుంటూరు ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారని దుయ్యబట్టారు.