అమరావతి : ఏపీలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ ప్రజలను రెచ్చ గొట్టే చర్యలకు దిగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu ) ఆరోపించారు. టీడీపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి సంయమనం పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో మాట్లాడారు. రాష్ట్రంలో తప్పులు చేసిన వారిని చట్టపరంగా చర్యలు ( Legally punish ) తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు కల్తీ జరుగలేదని ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, మంత్రులు, నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. హింస, విధ్వంసం, అవినీతి ధ్యేయంగా ఆవిర్భవించిన వైసీపీ ట్రాప్లో పడోద్దని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమిపై అనవసర విషయాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ధ్యేయమని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో మంత్రులు పాల్గొన్నారు.