అమరావతి : మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి, ముందుకు తగ్గలేదని, అందరిని సంతృప్తి పరిచేలా పకడ్బందీగా బిల్లును తీసుకువస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లుల రద్దుపై అసెంబ్లీలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలు,మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
మరోసారి చిక్కులు, న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ప్రస్తుత బిల్లులను రద్దు చేసుకున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆకతాయితో కాకుండా సమగ్రంగా ఆలోచించి, ఉన్నత స్థాయి కమిటీల సూచనల మేరకు మూడు రాజధానులు, సీఆర్డీ బిల్లును తీసుకొచ్చామని వెల్లడించారు. అయితే కొందరు దుష్ప్రచారం చేసి కోర్టుల ద్వారా అడ్డుపడ్డారని అన్నారు. కొద్దిమందిలో ఉన్న అసంతృప్తిని కూడా దూరం చేసేలా త్వరలో మరో బిల్లును తీసుకు వస్తామని తెలిపారు. అమరావతి రైతుల అసంతృప్తి విషయంలో మరోసారి కమిటీగాని, లేదా ఇంతకు ముందున్న కమిటీ ద్వారానైనా అవగాహన కల్పించి బిల్లును తీసుకువస్తామని పేర్కొన్నారు.
అమరావతిలో రైతుల సమస్యలు లేవని, అన్నింటిని పరిష్కరిస్తామని ఇదివరకే వెల్లడించామని బొత్స వివరించారు. కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన వివరించారు.