AP airports : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉందని.. కుప్పం, దగదర్తి, మూలాపేటలో కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేస్తున్నామని ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని పురందేశ్వరి అన్నారు. ఈ విమానాశ్రయాల ఏర్పాటు కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఒక విమానాశ్రయాన్ని, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలో మరో రెండు విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ జరుగుతోందని తెలిపారు.
కాగా ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగం పుంజుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం పనులు ఊపందుకున్నాయి. చంద్రబాబు కూడా గత వారం భోగాపురంలో పర్యటించి జూన్ 2026 నాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీఎంఆర్ని ఆదేశించారు. 2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని డెవలపర్ హామీ ఇచ్చారు.