YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్కళ్యాణ్పై ఏపీ సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వాళ్లు తప్పంటున్నారని తెలిపారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తప్పా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పామర్రులో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.708.68 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పెత్తందారులకు ఓ ధర్మం.. పేదవాళ్లకు మరో ధర్మమా? అని నిలదీశారు. పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. అహంకార భావజాలంతో ఉన్న చంద్రబాబులాంటివాళ్లు పెత్తందారులవైపు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని ఆరాటపడుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో యుద్ధం చేయాల్సి వస్తోందని వైఎస్ జగన్ అన్నారు. వీళ్లెవరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదని.. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానాయాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు ఉండొచ్చు.. కానీ పేద పిల్లలకు జగన్ ట్యాబ్లు ఇస్తే మాత్రం ఏవేవో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. విద్యారంగంలో పెత్తందారులకు, పేదలకు మధ్య క్లాస్ వార్ నడుస్తోందని అన్నారు. డబ్బున్నోళ్లకు, లేనివాళ్లకు యుద్ధం జరుగుతోందని చెప్పారు. మీ అన్నగా మీ తరఫున విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చానని అన్నారు.
ప్రభుత్వ బడులను నీరుగార్చింది చంద్రబాబు నాయుడే అని జగన్ ఆరోపించారు. తన కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబు నాయుడే అని అన్నారు. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేంటనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. పిల్లల చదువులు ఉండవు, ఇంగ్లీష్ మీడియం ఉండదు.. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటికి కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తామని కూడా వస్తారని.. అప్పుడు మీ ఇంటికి ఎవరు మంచి చేశారో ఆలోచన చేయాలని సూచించారు. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా ఉండండి అని పిలుపునిచ్చారు.