అమరావతి : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం(YCP Government) మరోసారి అధికారంలోకి రావడానికి పక్కావ్యూహంతో ప్రచారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏపీలోని నాలుగు ప్రాంతీయ సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన వైసీపీ రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ను ఖరారు చేసింది.
ఈనెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల(Nandyala), 29న ఎమ్మిగనూర్లో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy) తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో సభ నిర్వహించనున్నామని వెల్లడించారు. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనే సభలకు భారీ సంఖ్యలో కార్యకర్తలను, జనాలను తరలించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన నాలుగు ప్రాంతాల్లో కాకుండా మిగిలిన జిల్లాలో సభలు జరుగుతాయన్నారు.