అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్(Remal) తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పై ఉండదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రభావం కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ (Uppada) తీరంపై ప్రభావం కనిపించింది. సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.
ఉప్పాడ నుంచి కాకినాడ(Kakinada) వెళ్లే రహదారిపైకి కెరటాలు దూసుకొస్తుండడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించటానికి ఇబ్బంది పడ్డారు. అధికారులు ముందు జాగ్రత్తగా రహదారిని మూసేశారు. ఉప్పాడ, కొనపాపపేట, మాయపట్నం తదితర గ్రామాలపై సముద్రపు అలలు ప్రభావం కనిపించింది.
తీరం వెంబడి ఉన్న గృహాలు కోతకు గురయ్యాయి. తుఫాన్ ప్రభావం వల్ల పలుచోట్ల చెదురు ముదురు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు.