అమరావతి : అనతికాలంలోనే పేరు సంపాదించాలనే తాపత్రయంతో కొందరు సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకుంటుండగా మరికొందరు వింత చేష్టలు, ఆకతాయితనంతో ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. విశాఖ జంతు ప్రదర్శనశాలలో కొందరు యువకులు బరితెగించి ఎన్క్లోజర్లో ఉన్న అడవి పందుల చోటుకు వెళ్లి తృటిలో వాటి నుంచి ప్రమాదాన్ని తప్పించుకున్నారు.
విశాఖకు చెందిన ముగ్గురు యువకులు ఎన్క్లోజర్ దూకి అడవి పందులున్న చోటుకు వేగంగా పరిగెత్తి అడవి పందులను ఆటపట్టించాలని ప్రయత్నించారు. దీంతో ఒక అడవిపంది ఎదురు తిరిగి వెంట పడడంతో యువకులు భయంతో పరుగులు తీశారు. ఒక యువకుడి కాళ్లలో చొరబడిన పంది ఆ యువకుడిని కిందకు పడవేసి పారిపోవడంతో ఆ యువకుడు బతుకు జీవుడా అంటూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఈ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించిన సహచరులు నెట్టింట్లో పోస్టు చేయడం, అది వైరల్ కావడంతో ‘జూ’ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.