Vizag Drugs Case | వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కేసు కీలక మలుపు తిరిగింది. కంటైనర్లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్లో ఈస్ట్ కొనుగోలు చేశామని.. కంటైనర్లో ఎలాంటి డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. కంటైనర్లో డ్రగ్స్ లేవని నిరూపిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అయితే, ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేసిన సీబీఐ అధికారులు.. మరోసారి పరీక్షలు చేయనున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట 140 శాంపిల్స్ను పరీక్షించనున్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కంటైనర్లో ఉన్నవి డ్రగ్స్ అని నిర్ధారణ అయితే వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
కాగా, వైజాగ్ సీపోర్టులో డ్రగ్స్ బయటపడ్డ కేసులో సీబీఐ అధికారుల విధి నిర్వహణకు లోకల్ అధికారులు ఆటంకం కలిగించారని జరుగుతున్న ప్రచారంపై వైజాగ్ సీపీ రవిశంకర్ స్పందించారు. దర్యాప్తును ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారన్నది అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ సోదాలు నిర్వహించిందని వైజాగ్ సీపీ వెల్లడించారు. సీబీఐ అధికారుల వినతితోనే లోకల్ అధికారులు అక్కడికి వెళ్లారని తెలిపారు. నార్కోటిక్స్పై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆయన పేర్కొన్నారు. వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామని తెలిపారు. విద్యాసంస్థల్లో తరచూ సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిందితులను ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నామని చెప్పారు.