అమరావతి : అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు అధికారులు బుధవారం కురుగల్లు , నీరుకొండలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ విలీనానికి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయాలను వెల్లడించారు. విలీనానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేతులెత్తాలని కోరగా అధిక సంఖ్యలో వ్యతిరేకిస్తూ చేతులెత్తారు. దీంతో విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నట్లు తీర్మాణం చేస్తున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు.
గ్రామస్థులు మాట్లాడుతూ .. గతంలో ప్రజలతో చేసుకున్న సీఆర్డీ మాస్టర్ ప్లాన్ ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే 19 గ్రామాల్లో మాత్రమే అభిప్రాయాలను సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలు, రైతుల మధ్య చిచ్చుపెట్టి విభజించాలని చూడడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.