కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారంలో 4 రోజుల పాటు విమానాలు నడపడానికి ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర్పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందాలు చేసుకుంది. ఆదివారం, సోమవారం, బుధ వారం, శుక్రవారంలో గన్నవరం నుంచి కడపకు విమాన సర్వీసులు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. గన్నవరం నుంచి ఉదయం 11 గంటలకు విమాన సర్వీసు విజయవాడకు వస్తుంది. తిరిగి 11ః45 నిమిషాలకు కడపకు బయల్దేరుతుంది. వీటితో పాటు కడప నుంచి మరికొన్ని ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు సేవలందిస్తాయి. హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరుకు కూడా కడప విమానాశ్రయం నుంచి విమానాలు నడుస్తాయి.
అప్పట్లో ట్రూజెట్.. ఇప్పుడు ఇండిగో
ఇప్పటివరకు ఈ రూట్లలో విమాన సర్వీసులు నడిపిన ట్రూజెట్.. సర్వీసుల నిర్వహణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. దాంతో ఈ రూట్లో విమానాలను నడిపేందుకు ఇండిగోకు అవకాశం వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల మొత్తాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద కంపెనీకి ప్రభుత్వం చెల్లించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 27 వ తేదీ నుంచి చెన్నై-కడప, విజయవాడ-కడప మధ్య వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ నడపనున్నది.