Vijayawada | ఏపీలో ఉగ్రలింకులు కలకలం రేపాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే అనుమానంతో విజయవాడలో ముగ్గురు యువకులను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వించిపేటకు చెందిన ఇద్దరు 21 ఏళ్ల యువకులతో పాటు, భవానీపురానికి చెందిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసి రహస్యంగా విచారిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలపై కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిరంతర నిఘా పెట్టారు. ఇందులో భాగంగా సోషల్మీడియా కార్యకలాపాలపైనా దృష్టిసారించారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, విదేశాల్లో ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్మీడియాలో పోస్టులు పెట్టినట్లుగా ముగ్గురు యువకులు ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని రహస్యప్రదేశంలో విచారిస్తున్నారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి? వీరిని ఉగ్రవాదం వైపు ఎవరు ప్రేరేపిస్తున్నారు? వీరికి సోషల్మీడియా లింకులు ఎలా వస్తున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ టెర్రర్కు హైదరాబాద్తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ముగ్గురు యువకులకు హైదరాబాద్కు చెందిన మహిళతో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఆ మహిళే కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడలో ముగ్గురు అనుమానితుల్ని అరెస్టు చేసిన వెంటనే.. ఆమె పరారవ్వడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.