Kesineni Nani | టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని మరోసారి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా టీడీపీ-జనసేన కలిసి విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ-జనసేన ప్రకటించిన జాబితా చూస్తుంటే.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నట్టుగా ఉందని కేశినేని విమర్శించారు. ఆ జాబితాలో జనసేన ప్రకటించిన సీట్లు కూడా చంద్రబాబు నిర్ణయించినవే అని అన్నారు. ఈ జాబితాతో పాటు కొంతమంది రెబల్స్ను కూడా చంద్రబాబు పోటీలోకి దింపుతారని ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులను ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిసి వస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా కేశినేని నాని స్పందించారు. చంద్రబాబును బీజేపీ నమ్ముతుందని అనుకోవడం లేదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం అనేది కల అని అన్నారు.