విజయవాడ: సినిమా టికెట్ల కోసం విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకు 100 టికెట్లు తన చాంబర్కు పంపించండని లేఖలో మేయర్ కోరడం వివాదాస్పదంగా మారింది. ఈ టికెట్ల డబ్బులు తానే చెల్లిస్తానని కూడా లేఖలో పేర్కొనడంపై విపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయవాడ మేయర్గా ప్రజలకు సేవలు చేయాల్సింది పోయి.. సినిమా టికెట్లు అమ్ముకుంటారా అని మండిపడుతున్నారు.
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు రాసిన లేఖ దుమారం రేపుతున్నది. నగరం పరిధిలో విడుదలయ్యే పెద్ద సినిమాలకు మొదటిరోజున మొదటి షోకు వంద టికెట్లు తనకు ఇవ్వాలని లేఖలో కోరింది. ఈ టికెట్లకు డబ్బులు తానే చెల్లిస్తానని కూడా లేఖలో స్పష్టం చేశారు. తాను మేయర్గా ఉన్నందున కొత్త సినిమాలు విడుదలైన రోజున కార్పొరేటర్లు, నాయకులు టికెట్ల కోసం తనను అడుగుతున్నందునే ఈ లేఖ రాస్తున్నట్లు తన అనుచరులతో చెప్తున్నారంట. ఈ వ్యవహారంపై మేయర్ ఇంకా స్పందించలేదు.
మేయర్ లేఖపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ఆలోచించాల్సింది పోయి సినిమా టికెట్ల కోసం వెంపర్లాడటమేంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. మేయర్ పదవిలో ఉండి సినిమా టికెట్ల కోసం థియేటర్లకు లేఖ రాయడమేంటని వారు మండిపడుతున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో వంద టికెట్లు ఏం చేసుకుంటారో మేయర్ స్పష్టం చేయాలని జనసేన నేత పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు.
మేయర్ తీరుపై వైసీపీ అధినాయకత్వం కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తున్నది. వైసీపీ హైకమాండ్ దీనిపై ఇప్పటికే మేయర్కు తలంటినట్లుగా సమచారం. ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయానికి మేయర్ భాగ్యలక్ష్మి తెరలేపారని నెటిజెన్లు అంటున్నారు. మేయర్గా ఎంపికయింది ప్రజా సమస్యలను పరిషకరించడానికి తప్ప, సినిమాలను ఫస్ట్ రోజే చూడటానికి కాదంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.