న్యూఢిల్లీ: ఎంపీ రఘు రామకృష్ణరాజును చర్చల కార్యక్రమాలకు పిలువకుండా చూడాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్ టీవీ సీఈఓను కోరారు. ఈ మేరకు సంసద్ టీవీ సీఈఓకు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘు రామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ అధిష్ఠానం లోక్సభ స్పీకర్కు పిటిషన్ అందజేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్పై విచారణ జరుగుతున్నది.
రఘు రామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా సంసద్ టీవీ షోలలో పాల్గొంటున్నట్లు గుర్తించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన తమ పార్టీ ఆదేశాలను పాటించడం లేదని, తిరుగుబాటు ఎంపీగా ఉన్న ఆయన సంసద్ టీవీలో చేసే వ్యాఖ్యానాలు పార్టీ అభిప్రాయాలుగా పరిగణించకూడదని తన లేఖలో విజయసాయి స్పష్టం చేశారు. అతడిపై అనర్హత పిటిషన్ లోక్సభ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నదని, పార్టీ అభిప్రాయాలకు ఆయన ప్రాతినిధ్యం వహించరని పేర్కొన్నారు. అతడి అభిప్రాయాలు విశ్వసనీయత లేనివని, పక్షపాతంతో కూడుకున్నవని గుర్తించినట్లు చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా రఘు రామకృష్ణరాజు వివిధ చర్చా కార్యక్రమాల్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సంసద్ టీవీ సీఈఓకు విజ్ఞప్తిచేశారు. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆ తర్వాత పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఆయనను సంసద్ టీవీ షోలలో పాల్గొనకుండా నిరాకరించండి అని విజయసాయి సూచించారు. కాగా, గత ఏడాది మేలో రఘు రామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసిన కేసులో బెయిల్ పొందిన విషయం తెలిసిందే.