తిరుపతి: ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అచారకం మరోసారి బయట పడింది. తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహం ఇతర వాహనాల్లో తరలించకుండా అడ్డుకున్నారు. నిన్న మనుబోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. అతడి మృతదేహానికి గూడూరు ప్రభుత్వాసుపత్రిలో పంచనామా నిర్వహించారు.
మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు రూ. 4వేలు డిమాండ్ చేశారు. 17 కి.మీ దూరానికి రూ. 4వేలు ఇవ్వలేమని బాధితులు బ్రతిమిలాడినా కనికరించకుండా వ్యవహరించారు. కూలీ పనులు చేసుకునేవాళ్లమని చెప్పినా ససేమిరా అన్నారు. మరో వాహనాన్ని పిలుచుకుంటే అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో మరో వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లపై గూడూరు పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.