విశాఖపట్నం: టీటీడీ ఆలయ ఆదాయం పెంచుకోవడానికి డబ్బులు ఉన్నవారికే.. స్వామి వారి దర్శనాలు కల్పిస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆరోపించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర కోటి, కోటిన్నర రూపాయల ధర నిర్ణయించడంపై టీటీడీ చైర్మన్పై మండిపడ్డారు. టీటీడీ బోర్డు అనాలోచిత చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. భక్తులను దూరం చేసేందుకు, సంపన్నులకు దర్శనం కల్పించేందుకే టీటీడీ బోర్డు వ్యాపారాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
టీటీడీ అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోక పోతే పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీటీడీ జంబో బోర్డు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో చెప్పామని ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు. తిరుమలకు పాలకవర్గ సభ్యులు సచ్చీలురు కాకపోవడంతోనే శ్రీ వేంకటేశ్వర స్వామి భారీ వర్షాలతో సంప్రోక్షణ చేసుకున్నారని అన్నారు.