(Vellampalli on Radha) అమరావతి: తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. విజయవాడ రాజకీయాల్లో అలజడి లేపారు. తనను తన అభిమానులే కాపాడుకుంటారని చెప్తున్న వంగవీటి రాధా.. తన వ్యాఖ్యలపై నిలబడి ఉంటానన్నారు. అయితే, పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయకపోవడం విశేషం. కాగా, వంగవీటి రాధాకు ప్రాణహాని ఉన్నదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయనకు ఏదైనా జరరానిది జరిగితే తెలుగుదేశం పార్టీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రంగాను హత్య చేసింది టీడీపీ వారే.. ఇప్పుడు రాధాకు హాని జరిగితే వారిదే బాధ్యత అని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.
వంగవీటి రాధా తమ పార్టీలో ఉన్నా లేకపోయినా.. ఆయనకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంటుందని మంత్రి చెప్పారు. రాధా విజ్ఞప్తి చేయనప్పటికీ ఆయనకు రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రక్షణ కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోగిన చందంగా చంద్రబాబు తీరు ఉన్నదని, ఎక్కడో విదేశాల్లో కూర్చుని డీజీపీకి లేఖ రాయడమేంటని మంత్రి మండిపడ్డారు. కాగా, బీజేపీ నేత సోము వీర్రాజుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం ధరల గురించి మాట్లాడి సోము వీర్రాజు.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా కనిపించారని ఎద్దేవా చేశారు. ఉనికి కోసం బీజేపీ పాకులాడుతున్నదని, అందుకే ఇలాంటి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.