తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తెలిపారు. అనంతరం 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తొలిసారి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని తిరుచానూరులో శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు 550 టికెట్లు మంజూరు చేశామని, మరో వెయ్యికి పైగా టికెట్లను భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని వర్చువల్ విధానంలో పాల్గొన్నారని తెలిపారు.
భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో రెండు, పుష్కరిణి వద్ద ఒకటి, గంగుండ్ర మండపం వద్ద ఒకటి కలిపి నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.