తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన వకుళమాత ఆలయంలో ఈ నెల 23 న మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని శనివారం టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయం నిర్మాణ పనులను శనివారం ఉదయం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధర్మారెడ్డి పరిశీలించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి మాతృమూర్తి అయిన శ్రీ వకుళమాత ఆలయం ప్రాచీన కాలంగా పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అద్భుతంగా నిర్మించారని, టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం మరోమారు మంత్రితో కలిసి ఆలయ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన ఈఓ పలు సూచనలు చేశారు.
అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి భవనంలో జేఈఓ వీరబ్రహ్మం శ్రీ వకుళమాత ఆలయ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథ్, ఛీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.