తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తుల కొంగుబంగారమైన శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయ వైకుంఠ ద్వారం తెరిచారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు.
ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశామన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులకు వీఐపీల తాకిడీ పెరిగింది. కర్ణాటక గవర్నర్ థాహర్ చంద్ గెహ్లాట్, జమ్ము గవర్నర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి పలువురు ప్రముఖులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.