New Justices for AP HighCourt | ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. తమ న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి ఏపీ హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు కొందరు న్యాయవాదుల పేర్లు సిఫారసు చేసింది. వీటిలో ఏడుగురు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం.. కేంద్రానికి సిఫారసు చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చేసిన సిఫారసుల ప్రకారం కొనకంటి శ్రీనివాసరెడ్డి, జీ రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, టీ రాజశేకర్రావు, ఎస్ సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత అనే న్యాయవాదులు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఇంకా ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను నియమించాలని సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు సిఫారసులకు అనుగుణంగా ఏపీ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశాలో నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు పని చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 20 మంది మాత్రమే పని చేస్తున్నారు. తాజాగా ఏడుగురి నియామకంతో మొత్తం జస్టిస్ల సంఖ్య 27కు చేరింది. అయినా ఇంకా 10 మంది జస్టిస్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.