శ్రీశైలం : శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలను వైభవం, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (Executive Officer Peddiraj) ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను (Ugadi mahotsavam) నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి లోపాలు జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉత్సవాలకు కాలిబాట వచ్చే వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీమునికొలను(Beemuni Kolanu) , కైలాస ద్వారం గుండా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, క్యూలైన్లలో, క్యూ కాంప్లెక్సులో మజ్జిగ, బిస్కెట్లు, అల్పహారాన్ని అందించాలని సూచించారు. ఎండతీవ్రత కారణంగా క్యూకాంప్లెక్సుల అవసరాల మేరకు కూలర్ల ను ఏర్పాటు చేయాలని వివరించారు.
అన్నదానం,ఆలయ పరిసర ప్రాంతాల్లో లైటింగ్, వైద్య శిబిరాల(Health Centres) ఏర్పాటుపై ఈవో ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు. నందిసర్కిల్(Nandi Circle), కల్యాణకట్ట, పాతలగంగ మెట్ల మార్గం, హేమారెడ్డి, మల్లమ్మ మందిరం, యజ్ఞవాటిక, దేవస్థానం వైద్యశాల తదితర ప్రాంతాల్లో తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.